
ఇసుక రీచ్ పరిశీలనలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి
శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గంలో ఆకాశమే హద్దుగా ఇసుక దోపిడీ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆరోపించారు. బుధవారం మహాలక్ష్మీపురం వద్ద ఏర్పాటుచేసిన ఇసుక రీచ్ను రైతులతో కలిసి సందర్శించారు. రోజూ వందలాది వాహనాల్లో ఇసుక తరలిపోతుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇసుక తరలింపు కోసం వంశధార ఎడమ ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న 4ఆర్ పిల్ల కాలువను గ్రావెల్తో కప్పేసి ఉండడాన్ని పరిశీలించారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ర్యాంపు నిర్వహిస్తుండడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రెడ్డి శాంతి మీడియాతో మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. ఆయన కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం నడుస్తోందన్నారు. ఇసుక మేటలు పేరుతో అనుమతులు ఇవ్వడంపై అనేక సందేహాలు ఉన్నాయన్నారు. అనుమతుల పత్రంలో భగీరథపురంలో స్టాక్ పాయింట్ అని మాత్రమే చెప్పారని.. ఇసుక తవ్వకాలు ఎక్కడ చేయాలో చెప్పలేదన్నారు. గొట్టా బ్యారేజీని ప్రమాదంలో నెట్టేసేలా ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వడం దారుణమన్నారు.జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా వర్షాకాలంలో తవ్వకాలకు ఎలా అనుమతులిచ్చారో తెలియడం లేదన్నారు. పేరుకే సియాన్ గ్రూప్ అని.. అంతా నడిపిస్తోంది స్థానిక ఎమ్మెల్యేనని ఆరోపించారు. అవినీతితో పాతపట్నం నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు