ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం: మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు
ఫోన్ టాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చింది.
జనవరి 30న అనగా శుక్రవారం మధ్యాహ్నాం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సిట్ పేర్కొంది.ఇటీవలే ఇదే కేసులో మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను సిట్ విచారించింది. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావును కూడా సిట్ విచారించింది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది.65 ఏళ్ల వయసు కావడంతో ఎక్కడ విచారణకు హాజరుకావాల్సింది అనేది కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది అని నోటీసుల్లో పేర్కొంది. 1973 సెక్షన్ 160 క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం వయోభారంతో ఉన్నవారు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కేసీఆర్కు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడకు వచ్చి సిట్ బృందం విచారిస్తుంది అని సిట్ నోటీసుల్లో పేర్కొంది.
ఈ అంశాలపై ఆరా తీసే ఛాన్స్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో అధికారులు, ప్రజాప్రతినిధులకు సిట్ వరుస నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ,అధికారులకు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆధారాలను సేకరించడంతో కేసీఆర్ను విచారించి పలు అంశాలపై క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈమేరకు మాజీ సీఎం కేసీఆర్కు 160 CRPC కింద నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సమయంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులకు, ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల గురించి కేసీఆర్ను ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్కు సిట్ బృందం నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఎన్ని నోటీసులు ఇచ్చినా రేవంత్ రెడ్డిని వదలం: హరీశ్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు.'నిన్న నాకు నోటీసులు.. నేడు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే కేటీఆర్ ఒకవైపు గట్టిగా నిలదీస్తున్నాడు.. ఇంకో వైపు నేను నిలదీస్తున్నాను . అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతోంది.'అని హరీశ్ రావు ఆరోపించారు.బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పుకొచ్చారు. 'ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా రేవంత్ రెడ్డి... ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటాం... ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నిన్ను వదిలి పెట్టం. వెంటపడుతాం' అని హరీష్ రావు హెచ్చరించారు.
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఏకైక అజెండా: కేటీఆర్
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని...అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీశ్రావుకి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోంది అని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్' తప్ప మరొకటి కాదు అని చెప్పుకొచ్చారు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.