లా అండ్ ఆర్డర్, ప్రజా భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలి : డీసీపీ రాంరెడ్డి
పెద్దపల్లి/గోదావరిఖని, (తెలంగాణ రిపోర్టర్) :
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ను పెద్దపల్లి జిల్లా డీసీపీ బి. రామ్ రెడ్డి, ఏసీపీ ఎం. రమేష్ తో కలిసి సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఫిర్యాదుల సమస్య సత్వర పరిష్కారంకి కృషి చేస్తూ బాధితులకు పోలీసులు పై నమ్మకం భరోసా కలిగే విధంగా వ్యవహరించాలని సూచించారు. సెక్టార్ వారిగా ఎస్.ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోని రౌడీ షీటర్లు, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్, సస్పెక్ట్ షీట్స్ వారి ప్రస్తుత స్థితి గతులను సంబంధిత సెక్టార్ ఎస్.ఐ లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులకు కీలక ఆదేశాలు, సలహాలు, సూచనలు జారీ చేశారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్, ప్రజా భద్రతకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డీసీపీ ఆదేశించారు. రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘా పెంచి, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఓటర్లను భయపెట్టే లేదా ప్రలోభాలకు గురిచేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారం సమయంలో, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో
డీసీపీ, ఏసీపీ తో పాటు సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎస్ఐ రమేష్, మనోహర్, అనూష ఉన్నారు