అయిలాపూర్లో ఆర్టీసీ సిబ్బందిపై దాడి
ముగ్గురిపై కేసు నమోదు – ఎస్ఐ చిరంజీవి వెల్లడి
కోరుట్ల, ఫిబ్రవరి 20 (ప్రతినిధి అల్లం రాజేష్): కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం కల్లూర్ నుంచి అయిలాపూర్ మీదుగా యూసుఫ్నగర్ గ్రామానికి స్కూల్ విద్యార్థులు మరియు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళ్తోంది. అయిలాపూర్ గ్రామానికి చేరుకునే సమయంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన ద్విచక్రవాహనాన్ని పక్కకు జరపాలని డ్రైవర్ అక్కడున్న యువకులను కోరాడు.
ఈ విషయంపై అక్కడున్న ముగ్గురు వ్యక్తులు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కండక్టర్తో కూడా వాదనకు దిగుతూ, ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. గ్రామస్థులు వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బ్లూకోర్టు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. డ్రైవర్ భూపాల్ వంశీ, కండక్టర్ ఎర్రోళ్ల వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
దాడికి పాల్పడిన వారు అయిలాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి రాహుల్, నల్ల రక్షక్, మారంపల్లి వినయ్గా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.