నంద్యాలలో ఉద్రిక్తత.నడిబొడ్డున వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం!
AIMA న్యూస్ నంద్యాల జిల్లా.. నంద్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీనివాస్ నగర్ సెంటర్లో ఘోరం చోటుచేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం ముఖ భాగాన్ని పగులగొట్టి వికృతంగా మార్చారు. ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం వైకాపా శ్రేణులు అక్కడే బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైకాపా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత హేయమైన చర్య. రాజకీయ లబ్ధి కోసం, నంద్యాల పట్టణంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడానికే కొందరు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ జ్ఞాపకాలను, ఆయనపై ఉన్న అభిమానాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు.ఈ ఘటనకు కారణమైన నిందితులను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి, అరెస్ట్ చేయాలి.ఇలాంటి దాడులకు పాల్పడే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి.
ధ్వంసమైన విగ్రహం స్థానంలో ప్రభుత్వ/పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణలో తిరిగి వైఎస్సార్ విగ్రహాన్ని గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించాలి.
శాంతియుతంగా ఉన్న నంద్యాలలో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే వైకాపా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.