
*"అమ్మ" మార్గదర్శనంతో బంగారు కుటుంబాలకు బాటలు వేయండి*
- **పీ4 కార్యక్రమం లో “అమ్మ “అడుగులు కలపాలి*
- *జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, జూన్ 28 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
సామాజిక కార్యక్రమాల నిర్వహణలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ). పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వినూత్న పీ4 విధానం అమల్లోనూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు.
ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) ప్రతినిధులు శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశతో సమావేశమయ్యారు.పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి ఉన్నత విద్య అభ్యసించేందుకు అసోసియేషన్ కృషిచేస్తోందని. ఏటా దాదాపు 450 మందికి రూ.18 లక్షల ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు వివరించారు. మొగల్రాజపురంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను దత్తత తీసుకొని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు వంటివాటిని అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ నగరంలో ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అమ్మ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పీ4 (ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్యం) విధానాన్ని తీసుకొచ్చిందని. పేదలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు ఆయా కుటుంబాలకు సరైన మార్గనిర్దేశనం అవసరమని పేర్కొన్నారు. అమ్మ అసోసియేషన్తో పాటు సభ్యులు బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా వ్యవహరించేందుకు ముందుకు రావాలని కోరారు. స్వర్ణాంధ్ర @ 2047 సాకారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అమ్మ అసోసియేషన్ చేయి కలపాలని, పేదరిక నిర్మూలనకు చేయూత నివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు యార్లగడ్డ సుబ్బారావు, కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, ప్రస్తుత ప్రెసిడెంట్ గారపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.